జనం రోడ్ల మీదికి రాకుండా వలంటీర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలి: పవన్

  • ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇస్తామని సర్కారు చెప్పిందన్న పవన్
  • కరోనా నివారణలో వలంటీర్లు కీలకపాత్ర పోషించాలని సూచన
  • వలంటీర్ల పాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్
కరోనాపై పోరాటంలో గ్రామ వలంటీర్లు సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కొన్ని వేల మంది ప్రజలు బయటికి వచ్చి రేషన్ దుకాణాల ముందు గుమికూడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో జనం రోడ్ల మీదికి రాకుండా వలంటీర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇంటి వద్దకే రేషన్ సరుకులను వలంటీర్ల ద్వారా అందజేస్తామని వైసీపీ సర్కారు ఇప్పటికే ప్రకటించిందని, ఈ నేపథ్యంలో వలంటీర్లు మరింత కష్టపడాలని పవన్ తెలిపారు. లాక్ డౌన్ విజయవంతం చేయడంలో వలంటీర్లే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నివారణలో వలంటీర్ల పాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ ట్వీట్ చేశారు.

Pawan Kalyan
Volunteers
Andhra Pradesh
Corona Virus
Lockdown

More Telugu News